విమానంలో ఫోటోలు తీసిన పాపానికి పదేళ్ల జైలు.. దుబాయ్‌లో భారత యువకుడికి కఠిన శిక్ష

  • బిహార్‌కు చెందిన వసీం అక్రమ్‌కు పదేళ్ల జైలు శిక్ష విధించిన కోర్టు
  • భద్రతా నియమాలు తెలియక పొరపాటు చేశాడంటున్న కుటుంబ సభ్యులు
  • కొడుకును విడిపించాలంటూ భారత ప్రభుత్వానికి కుటుంబం విజ్ఞప్తి
ఉపాధి కోసం దుబాయ్ వెళ్లిన ఓ భారతీయ యువకుడికి స్థానిక కోర్టు పదేళ్ల కఠిన కారాగార శిక్ష విధించింది. విమానంలో తన మొబైల్ ఫోన్‌లో ఫోటోలు, వీడియోలు తీసుకున్నందుకు ఈ శిక్ష పడింది. ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది.

వివరాల్లోకి వెళితే, బిహార్‌లోని గోపాల్‌గంజ్ జిల్లాకు చెందిన వసీం అక్రమ్ అనే యువకుడు కూలీగా పనిచేసేందుకు దుబాయ్ వెళ్లాడు. సుమారు రెండు నెలల క్రితం, శుక్రవారం ప్రార్థనల అనంతరం పోలీసులు అతడిని మరికొందరితో పాటు అదుపులోకి తీసుకున్నారు. విచారణ తర్వాత ఇతరులను విడిచిపెట్టి, వసీంను మాత్రం జైలుకు పంపారు. అతని ఫోన్‌లో విమానానికి సంబంధించిన ఫోటోలు, వీడియోలు ఉండటమే ఇందుకు కారణమని తేలింది.

ఈ కేసును విచారించిన దుబాయ్ కోర్టు, మే 14న వసీం అక్రమ్‌ను దోషిగా నిర్ధారించి పదేళ్ల జైలు శిక్ష విధించింది. దుబాయ్ చట్టాల ప్రకారం విమానాల్లో, విమానాశ్రయాల్లో ఫోటోలు తీయడం తీవ్రమైన భద్రతా ఉల్లంఘన కిందకు వస్తుంది.

అయితే, తన కుమారుడికి అక్కడి కఠినమైన నిబంధనల గురించి తెలియదని, సరదాగా జ్ఞాపకం కోసం ఫోటోలు తీసుకుని ఉండవచ్చని వసీం తల్లి షైదా ఖాతూన్ ఆవేదన వ్యక్తం చేశారు. వసీం మీద ఆధారపడి అతని భార్య, ఇద్దరు పిల్లలు జీవిస్తున్నారని కుటుంబ సభ్యులు కన్నీరుమున్నీరవుతున్నారు. ఈ విషయంపై వారు స్థానిక జిల్లా మేజిస్ట్రేట్‌ను కలిసి, తమ కుమారుడిని విడిపించేందుకు భారత ప్రభుత్వం జోక్యం చేసుకోవాలని విజ్ఞప్తి చేశారు. వారి ఫిర్యాదును ప్రభుత్వానికి తెలియజేస్తామని అధికారి హామీ ఇచ్చారు.
 

Waseem Akram
Dubai
Indian youth
jail sentence
plane photos
bihar
gopalganj district
uae laws
airport security
Shazia Khatoon

More Telugu News